బెంగళూరులో స్తంభించిన బస్సులు- బోసిపోయిన మెజస్టిక్
కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నిరవధిక సమ్మె ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి బస్సులు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రయాణికులు, విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ కొంతకాలంగా పోరాడుతోంది. సోమవారం కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశం అయ్యారు. అవి ఫలించలేదు. దీనితో నిరవధిక సమ్మెకు కేఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ అడ్వొకేట్ ఎన్ పీ లమృతేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనితో హైకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ్ పాషా.. ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు కోర్టు ఆదేశాన్ని పాటించాలని, సమ్మెలో పాల్గొనకూడదని అన్నారు.
